తెలంగాణలో భారీ వర్షాలు.. మానేరు వాగులో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు

  • సిరిసిల్ల జిల్లాలో పొంగిపొర్లుతున్న మానేరు వాగు
  • నిన్న వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
  • ఈరోజు వరద ఉద్ధృతి పెరగడంతో నీట మునిగి కొట్టుకుపోయిన బస్సు
తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మానేరు వాగు ఉద్థృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మానేరు వాగుపై ఉన్న లోలెవెల్ వంతెనపై నిన్న ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. ఈ ఉదయం ప్రవాహ ఉద్ధృతి మరింత పెరగడంతో బస్సు కొట్టుకుపోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సును బయటకు తీసేందుకు అధికారులు సాహసించలేకపోయారు.

నిన్న నీటిలో చిక్కుకున్న సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, వీరందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. నిన్న బస్సును జేసీబీ సాయంతో తీసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఆ తర్వాత నీటి ప్రవాహం మరింత పెరగడంతో బస్సును తీసే ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు.

Rajanna Sircilla District
Floods
RTC Bus

More Telugu News